తెలంగాణ రాష్ట్రంలోని యువతకు క్షేత్రస్థాయిలో సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)కు జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి.
నేడు ఉత్సాహభరిత వాతావరణంలో ములుగు జిల్లా కేంద్రంలో టీటా కార్యాలయం ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆధిత్య ఆదేశాలతో పూర్తి మౌళిక సదుపాయాలతో సిద్ధమైన టీటా ఆఫీసును టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల నేడు ప్రారంభించారు.
టీటా కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని యువతకు డిజిటల్ మార్కెటింగ్లో 20 రోజుల ఉచిత శిక్షణను టీటా అందుబాటులోకి తెచ్చింది.
జిల్లా కేంద్రాల్లో టీటా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ ఐఏఎస్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆధిత్య ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ కార్యాలయంలో టీటాకు 1500 చదరపు అడుగుల స్థలంలో పూర్తి మౌళిక సదుపాయాలు కల్పించి ఆఫీసు ఏర్పాటు చేశారు.
10 కంప్యూటర్లు సహా పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి రూపొందిన ఈ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా పూజారి సమక్షంలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల నేడు ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సమక్షంలో టీటా జిల్లా కార్యదర్శి ధర్మేందర్ బొచ్చు ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్యదర్శి దీపిక జోషి ధర్మేందర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యాలయం ప్రారంభం అనంతరం డిజిటల్ మార్కెటింగ్ పై ఉచిత శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. 20 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ గ్రామీణ ప్రాంత వారికి ఉపయుక్తంగా ఉండనుంది. ములుగు జిల్లాలో టీటా కార్యాలయం ప్రారంభం అయినట్లే ఇదే ఒరవడిలో త్వరలో వివిధ జిల్లాల్లోనూ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.
కాగా ఇప్పటికే ములుగు జిల్లాలో టీటా పలు కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో డిజిటల్ యాత్ర చేపట్టారు. టి.కన్సల్ట్ ద్వారా కోవిడ్ సమయంలో ఆన్లైన్ కన్సల్టేషన్లు నిర్వహించారు.
టీటా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి , జిల్లా డీఆర్డీఓ ఎ. పారిజాతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించిన అధనపు కలెక్టర్ టీటా బృందాన్ని అభినందించారు. కోడింగ్ స్కిల్స్ ను సాంకేతిక విద్య ములుగు జిల్లా వారికి అందించాలని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల ను కోరారు.
టీటా జిల్లా కార్యదర్శి బొచ్చు ధర్మేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో టీటా కార్యాలయం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టున్నట్లు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవానికి టీటా ఉపాధ్యక్షుడు రాణా ప్రతాప్ బొజ్జం, టీటా సభ్యురాలు సౌమ్య, విద్యార్థి విభాగం కార్యదర్శులు మహ్మద్ ఇలియాస్ , శ్రావణి, సత్యరాజ్ , ములుగు జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రణయ్ , వినోద్, శిరిష, రాహుల్, అక్షయ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ స్ట్ర క్టర్స్ కిరణ్, వెంకట్ తదితరులు హాజరయ్యారు.