ఫైర్ బ్రాండ్ లీడగర్ గా చెప్పుకునే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగనన్న షాక్ ఇచ్చాడు. మంత్రి పదవి ఆశించిన రోజాకు ఆ పదవి దక్కలేదు సరికదా ఏపీఐఐసీ చైర్మన్ పదవి కూడా ఇప్పుడు ఊడబెరికారు. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మెట్టు గోవిందరెడ్డి కి అప్పగించారు. కొంత కాలంగా పార్టీలో రోజాకు పొగ పెడుతున్నారనే ప్రచారం సాగుతుండగా.. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతోంది.
నగరి ఎమ్మెల్యే రోజా కొంత కాలంగా చిత్తూరు వైసీపీ రాజకీయాలలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. రోజాను పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య మాటల యుద్ధం చాలా కాలం సాగింది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోసుకున్నారు. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జిల్లాలో పార్టీ రాజకీయాలను శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనూ రోజాకు విబేధాలున్నాయి.
ఇద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా ఆరోపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, రోజా మంత్రి పెద్ది రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని అదే సోషల్ మీడియాలో ద్వారా చెప్పుకున్నారు.
అంతేకాదు సయోధ్య చిహ్నంగా రక్షా బంధన్ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు. తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లో మరో మారు పార్టీలో వర్గపోరు భగ్గుమంది. రోజా వర్గం ఆమె ప్రత్యర్థి వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కేజే శాంతికి వర్గం విడివిడిగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించడంతో పార్టీలో వర్గపోరు మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చింది.
ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. వైఎస్ జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజా టార్గెట్ ఆమె ప్రత్యర్ధి వర్గం పావులు కదపడం చూస్తుంటే.. పార్టీ పెద్దలే తెర వెనక నుంచి కథ నడుపుతున్నారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.