భారీ వర్షాలకు నిరాశ్రయులైన పేద ప్రజలకు సాయం చేద్దామని వాగుదాటి మరీ వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి సాయం కేవలం కొందరికి మాత్రమే అందింది.
ఇదే విషయాన్ని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తహసిల్దార్ కు నేడు ఫిర్యాదు చేశారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు నిండడంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రజలు బిక్కు బిక్కు మంటూ ఇళ్లలోనే కాలం గడపాల్సి వచ్చింది. పేద ప్రజలు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతంలో గొర్రెల కాపరులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారందరికి ఆహారం వండి వడ్డిస్తామని కూడా చెప్పారు. దాంతో ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారా? తమకు ఆహారం ఎప్పుడు అందుతుందా అని ప్రజలు ఎదురు చూశారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి మరబోటు లో ప్రజలకు పంపిణీ చెయ్యడానికి కూరగాయలు, నిత్యావసరాలు తరలించారు. ఈ సందర్భంగా గురువారం నాడు ఎమ్మెల్యే బీరం మరబోటు ద్వారా వాగు దాటి ముక్కిడిగుండం చేరారు. అక్కడి టీఆర్ఎస్ నాయకులకు కూరగాయలు, నిత్యావసరాలు ఇచ్చారు.
వాటిని అవసరం ఉన్న వారందరికి సరఫరా చేయమని చెప్పారు. అయితే అక్కడి వారు మాత్రం గ్రామంలో కొందరికే ఇచ్చారు. బియ్యం అస్సలుకే ఇవ్వలేదని వారు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.
గొర్ల కాపరులకు ఆహారం వండి పెడతాం అన్నారు. అదికూడా జరగలేదని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన నల్లవేల్లి క్రాంతి స్థానిక తహశీల్దార్ ఎక్బల్ కు చెప్పారు. తహశీల్దార్ స్పందించి అందరికి ఇప్పిస్తానని హామీ ఇచ్చారని క్రాంతి చెప్పారు.
ఎమ్మెల్యేగారూ వింటున్నారా?