తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కావడంపై బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అయింది. చంద్రబాబునాయుడు, అమిత్ షాతో సమావేశం కావడం, ఆ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొనడంతో త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ
తెలుగుదేశం పొత్తు ఉంటుందనే ఊహాగానాలు చెలరేగాయి. తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే అధికారానికి చేరువ కావచ్చునని బీజేపీలోని కొందరు పెద్దలు భావించినందునే ఇద్దరి సమావేశం జరిగిందని అంటున్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారేందుకు అవకాశం ఉంది.
దాంతో బీఆర్ఎస్ నేతలు ఈ భేటీపై దృష్టి సారించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ లు కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంచనాలలో బీఆర్ఎస్ నేతలు మునిగిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసింది.
అయితే ఆశించిన ఫలితాలు రాలేదు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఏపిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదు. ఏపిలో గత కొద్ది కాలంగా బీజేపీలోని కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని తమ పార్టీ అగ్రనేతలకు చెబుతున్నారు.
అవకాశం వచ్చినప్పుడల్లా అధికార వైసీపీని తిట్టకుండా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు. తద్వారా వైసీపీకి ఎలాంటి హానీ కలగకుండా ఏపి బీజేపీలోని నలుగురు నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ లో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవకూడదని ఏపీ నాయకులు చెబుతూ వచ్చారు.
తెలంగాణ బీజేపీలోని కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం వల్ల ఎన్నికల్లో ఎంతో ప్రయోజనం ఉంటుందని వాదిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో, ఆ తర్వాత జరిగిన జీహెచ్ ఎంసి ఎన్నికలలో సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఆ ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ నుంచి తమకు
మరలుతాయని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదే పరిణామంపై బీఆర్ఎస్ కూడా ఆందోళన చెందుతున్నది. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ ముస్లిం ఓట్లపై కన్నేసి తన్నుకుపోతుంటే మరో వైపు సెటిలర్ల ఓట్లు తెలుగుదేశం, బీజేపీ
చీల్చుకుంటే తమకు విజయావకాశాలు సన్నగిల్లుతాయని బీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నది. తెలంగాణ లో బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయకుండా ఉంటే తమకు లాభం చేకూరుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నది.