భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మీటింగ్ ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వీళ్లిద్దరి భేటీ ఉమ్మడి టీఆర్ఎస్లో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా దమ్మపేట వెళ్తూ మార్గమధ్యలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావును తుమ్మల కలిశారు. మణుగూరులోని రేగా క్యాంప్ కార్యాలయాలకెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు ఇరవై నిమిషాలపాటు వీళ్లిద్దరి మీటింగ్ జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్థితిపైనే వీళ్లిద్దరూ చర్చించారు. పార్టీ కార్యకర్తల ద్వారా అందిన సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలిచేలా కలిసి పనిచేద్దామని, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ బలోపేతం కోసం కృషిచేయాలని, ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు,సమావేశాలు నిర్వహించాలని తుమ్మల సలహా ఇచ్చారు. అదే టైమ్లో రేగాకు వ్యక్తిగత సలహాలు కూడా ఇచ్చారు తుమ్మల. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లుంటారు జాగ్రత్త అంటూ రేగాను హెచ్చరించారు.మోసగాళ్లు, వెన్నుపోటుదారుల విషయంలో పార్టీ కేడర్ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.రేగా కాంతారావు విజన్ ఉన్న లీడర్ అన్న తుమ్మల నాగేశ్వర్రావు, అతనిని గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. మొత్తానికి,రేగా కాంతారావు,తుమ్మల నాగేశ్వర్రావు మీటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది.
previous post