విజయనగరం జిల్లాలో మొబైల్స్ విక్రయించే షాపులు, ఫోనుల రిపేరింగు సర్వీసులు నిర్వహించే షాపుల యజమానులతో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ మహిళల రక్షణ, భద్రత మనందరి బాధ్యతగా ప్రతీ ఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు.
మొబైల్స్ కొనుగోలు చేసేందుకు మరియు రిపేరు చేయించేందుకు వచ్చే మహిళల స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా దిశా (ఎస్ఓఎస్) యాప్ నిక్షిప్తమై ఉండే విధంగా చూడాలన్నారు. మహిళలు తమ మొబైల్ ఫోనుల్లో దిశా (ఎస్ఓఎస్) యాప్ ను నిక్షిప్తం చేసుకోవడం వలన తాము ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయడం వలన లేదా గాలిలో మొబైల్ ను ఊపడంతో, మీరు ఉన్న ప్రాంతానికి పోలీసులు క్షణాల్లో చేరుకొని, మీకు రక్షణగా నిలుస్తారన్న విషయాన్ని మొబైల్స్ కొనుగోలు లేదా రిపేర్ చేయించేందుకు వచ్చే మహిళలకు తెలియజేయాలన్నారు.
దిశా యాప్ మొబైల్స్ లో ఉండడం వలన వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎటువంటి విఘాతం కలగదని, ఆపదలో ఉన్న సమయంలో ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయడం వలన మాత్రమే, వారు ఉన్న లొకేషను దిశా కంట్రోల్ రూంకు, అక్కడ నుండి వారు ఆపదలో ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు సమాచారం అందించి, రక్షించుట జరుగుతుందన్న విషయాన్ని మొబైల్ వినియోగదారులకు అవగాహన కల్పించాలని షాపు యజమానులను జిల్లా ఎస్పీ కోరారు.
గతంలో కూడా పోలీసుశాఖ విజ్ఞప్తి మేరకు మహిళా దినోత్సవ రోజున దిశా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి మొబైల్స్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇచ్చి సహకరించిన విధంగానే, దిశా యాప్ వినియోగం పట్ల కూడా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. దిశా యాప్ నిక్షిప్తం చేసేందుకు మొబైల్ లో ఎక్కువ స్పేస్ పట్టదని, అదే విధంగా యాప్ డౌన్ లోడు చేసుకొని, తిరిగి డిలీట్ చేయడం వలన అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయాన్ని, సహకారాన్ని పొందే అవకాశం కోల్పోతామన్నారు.
కావున, ప్రతీ మహిళ తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోనులో దిశా (ఎస్ఓఎస్) యాప్ ను డౌన్ లోడు చేసుకొని, ఆపద సమయంలో మహిళలు పోలీసుల రక్షణ, సహాయాన్ని పొందే విధంగా అవగాహన కల్పించడంలో మొబైల్స్ విక్రయించేవారు, రిపేరింగులు నిర్వహించేవారు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఇప్పటికే విజయనగరం సబ్ డివిజనులో 1,56,490, బొబ్బిలి సబ్ డివిజనులో 59,016, పార్వతీపురం సబ్ డివిజనులో 62,731, జిల్లా వ్యాప్తంగా 2 లక్షల,78,వేల 237 దిశా యాప్ లను స్మార్ట్ ఫోన్ల్ లో డౌన్ లోడ్ చేయించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.అంతకు ముందు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ – మొబైల్స్ మరియు మొబైల్ రిపేర్స్ చేసే అన్ని షాపుల వారికి ఒక “క్యూఆర్” కోడ్ ఉండే స్టిక్కర్లును త్వరలో అందజేస్తామన్నారు.
మొబైల్స్ కొనుగోలు చేసే వారు, రిపేరు చేయించుకొనే వారి మొబైల్స్ తో ‘క్యూఆర్’ కోడ్ ను స్కాన్ చేయడం వలన, సులువుగా వారి మొబైల్స్ లో దిశా (ఎస్ఓఎస్) యాప్ నిక్షిప్తం అవుతుందన్నారు. ఈ యాప్ మహిళల రక్షణకు ఏవిధంగా ఉపయోగపడుతున్నది వినియోగదారుకు తెలియజేయాల్సిందిగా షాపు యజమానులను కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, 1వ పట్టణ సీఐ జె.మురళి, 2వ పట్టణ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, ఆర్ఐ చిరంజీవి, మొబైల్ మరియు రిపేరింగు సర్వీసులు నిర్వహించే షాపు యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.