మహిళా భద్రతే ప్రధమ లక్ష్యంగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొనివచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్ ను తూర్పుగోదావరి జిల్లాలో 10 లక్షల మంది మహిళలచే ఇన్ స్టాల్ చేయించాలనే ఉద్దేశ్యంతో తూర్పుగోదావరి ఎస్పిరవీంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
దాంతో జిల్లా పోలీస్ శాఖ ఇప్పటి వరకు 4,71,642ల మంది మహిళల ఫోన్లలో దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇన్ స్టాల్ చేయించింది. దీనితో బాటు మహిళా భద్రతకై మరొక ముందడుగు వేసిన జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబు ఈ రోజు కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ లో దిశ మహిళా పిఎస్ అవుట్ పోస్ట్ ను ఎస్పి ప్రారంభించారు.
మహిళా భద్రతే సమాజ అభివృద్ధికి కొలమానం అని ఎస్పి పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఈ దిశ మహిళా అవుట్ పోస్ట్ నెలకొల్పడం ద్వారా నాంది పలికినట్లు అయ్యిందని కాకినాడ సిటీ లోని పలురంగాల ప్రముఖులు, మేధావులు భావిస్తున్నారు.
ఇప్పటికే కాకినాడ స్మార్ట్ సిటీ శాంతిభద్రతల విషయంలో రాజీలేని విధంగా ఎస్పి తీసుకుంటున్న పలు చర్యలు ప్రజామోదం పొందుతున్నాయని ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు, వివిధ వర్గాల ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది.