మహేష్ భట్ రాబోయే చిత్రం ‘సడక్ 2’ ను ఇప్పటికి 2.7 మిలియన్ మంది యూట్యూబ్ ప్రేక్షకులు తిరస్కరించారు. సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నుంచి బాలివుడ్ ప్రేక్షకులలో మహేష్ భట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
మహేష్ భట్ రెండు దశాబ్దాల తర్వాత దర్శకుడిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కుమార్తెలు అలియాభట్, పూజా భట్, సంజయ్ దత్, ఆదిత్యా రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో తిరస్కరణలు ప్రారంభం అయ్యాయి.
యూట్యూబ్ లో లైక్ బటన్ తో బాటు డిస్ లైక్ బటన్ కూడా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి అందరూ డిస్ లైక్ నొక్కుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యలో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి కి మహేష్ భట్ కు సంబంధం ఉండటమే సడక్ 2 పై ప్రేక్షకుల నిరసనకు కారణం.