స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులతో జనవరి మొదటి వారంలో చిన్నంబావి మండల కేంద్రంలో నిషేదిత అలివి వలల పై అవగాహన సదస్సు నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
గురువారం వనపర్తిలో తన ఛాంబర్ లో నిషేధిత అలివి వలలపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిషేధిత అలివి వలల వల్ల కలిగే నష్టం, తదితర అంశాలపై మత్స్యకారులకు తెలిపి వాటి నిర్మూలనకు చర్యలు తీసుకునే విషయంలో వారికి నమ్మకాన్ని కల్పించాలని, ఆ తర్వాత నిషేధిత వలలను వినియోగించకుండా వాటిని వినియోగించే వారి సమాచారం సేకరించాలన్నారు.
ఈ విషయంలో మత్స్యకారులలలో పూర్తి విశ్వాసం పెంచాలని కలెక్టర్ అన్నారు. నదీ పరివాహక గ్రామాలలో రాత్రివేళల్లో పోలీసు నిఘా పెంచాలని , పోలీసు శాఖ ద్వారా గట్టి పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు . రెవిన్యూ,మత్స్య శాఖ అధికారులతో రెండు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ టాస్క్ఫోర్స్ బృందంలో ఇద్దరు క్షేత్రస్థాయి సహాయకులు, ఇద్దరు మత్స్యకారులు, అదేవిధంగా ఒక ఫీల్డ్ మెన్ ఉండేలాగా ఏర్పాటు చేయాలని, వీటన్నింటిపై మత్స్య శాఖ అధికారులు పర్యవేక్షణ చేసే విధంగా బృందాన్ని ఏర్పాటు చేశారు.
తాసిల్దార్ అదేవిధంగా సంబంధిత ఎస్సై అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో నిషేధిత అలివి వలలు వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎస్ ఏ రహమాన్,ఆర్ డి ఓ అమరేందర్,సి. ఐ. సూర్య నాయక్ హాజరయ్యారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి