ఎన్నికల సమయంలో ఎన్నో చెబుతాం. అవన్నీ నిజమనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఆ సమయానికి నోటికి ఏది వస్తే ఆ హామీ ఇవ్వడం తర్వాత మరచి పోవడం మామూలేనని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మరొక్క మారు నిరూపించారని కొల్లాపూర్ మునిసిపాలిటీ 11 వార్డు కౌన్సిలర్ బోరెల్లి కరుణ మహేష్ వాపోతున్నారు.
డా. బీఆర్ అంబెడ్కర్ దళిత జాతికి కల్పించిన హక్కులను భంగం కలిగించేలా ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆమె అంటున్నారు. గడచిన మున్సిపల్ తొలి జనరల్ బాడీ సమావేశంలో 11 వార్డు కౌన్సిలర్ బోరెల్లి కరుణ మహేష్ వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని ప్రసంగిస్తూ ఎస్ సి రిజర్వేషన్ అయిన 11 వార్డు ను తాను దత్తత తీసుకొని అభి వృద్ధి చేస్తానని నిండు సభలో వాగ్దానం చేశారు.
ఈ వాగ్దానం నిజమని నమ్మిన సంబంధిత కౌన్సిలర్ తన ప్రాంత అభివృద్ధిపై అనేక ఆశలు పెట్టుకుని, అదే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పారు. ఎమ్మెల్యే తమ వెంట ఉన్నారని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలకు చెప్పుకున్నారు. అయితే ఆమె ఆశల్ని, ఆ ప్రాంత ప్రజల ఆశల్ని ఎమ్మెల్యే గాలికి వదిలేశారు. 11 వ వార్డులో అభి వృద్ధి కి మంజూరు అయిన నిధులను దారి మళ్లిస్తూ జనరల్ స్థానంలో నిధులు వెచ్చించి ఆర్భాటంగా శిలాఫలకాలు వేస్తూ బహిరంగ గానే దళిత జాతిని ఎమ్మెల్యే అవమానిస్తున్నారని కరుణ ఆరోపించారు.
ఎమ్మెల్యేనే పక్షపాతం చూపితే ఎలా?
నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత స్థాయిలో ఉన్నఎమ్మెల్యే కేవలం తమ వర్గం వారి వార్డులో మాత్రమే అభి వృద్ధి చేస్తే సరిపోదని కరుణ అంటున్నారు.
వెలివాడలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందనిగుర్తు చేసుకోవాలని ఆమె కోరుతున్నారు. 11వార్డుకు మంజూరు అయిన ఎస్ సి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడమే కాకుండా శిలాఫలకంపై 11వార్డు కౌన్సిలర్ పేరు ను కూడా విస్మరించి దళితులపై ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రమైన విచక్షణ చూపిస్తున్నారని కరుణ అన్నారు.
ఎస్ సి వార్డుల అభివృద్ధి కి మంజూరు అయిన నిధులను వెంటనే తిరిగి దళిత బహుజన కాలనిలో ఉపయోగించేలా చర్యలు చేపట్టకుంటే దళిత జాతి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆమె ఎమ్మెల్యేను హెచ్చరించారు.