రైతులను తప్పుదోవ పట్టించడం, వారిని బెదిరించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో దేశంలో కేసీఆర్ ఒక్కరికే సాధ్యమని, నియంత్రిత వ్యవసాయ విధానం బాగుంటుందని చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం కూడా కేసీఆర్కే సాధ్యపడిందని రైతు లను బెదిరించి సన్నవడ్లు పండించేలా చేశారని ఇప్పుడు మద్దతు ధర ఇవ్వట్లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో విలేఖరులతో డీకే అరుణ మాట్లాడారు. రైతుల పట్ల కేసీఆర్ తీరు బాధ్యతారహితంగా ఉందని విమర్శించారు. నిర్బంధ వ్యవసాయం మంచిది కాదని బీజేపీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. జనగామ సభలో సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా వంద నుంచి 150రూపాయలు చెల్లిస్తామని చెప్పలేదా? అని ప్రశ్నించారు. మరీ దాన్నిఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలను వ్యతిరేకించిన టిఆర్ఎస్, భారత్ బంద్ లో పాల్గొని రైతులను రెచ్చగొట్టలేదా?
ఫౌంహౌస్ నుంచి బయటకు వచ్చాక, కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాల విలువ తెలిసిందా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి వ్యతిరేకత రాకపోయే సరికి ఇప్పుడు కేంద్ర చట్టాలకు మద్దతు ఇవ్వడంలో ఆయన మతలబు ఏంటని ప్రశ్నించారు.
ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారనే కోపంతో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారని రైతులను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాల వల్ల రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేస్తుందన్నారు. పంట కొనుగోలు వల్ల ఆరు సంవత్సరాలుగా నష్టం వచ్చినప్పుడు.. ఎందుకు ఇన్నిరోజులు మాట్లాడలేదని దుయ్యబట్టారు.
వడ్లు, పత్తి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఎలా వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం చేసిన బీజేపీ సహించదన్నారు. రైతులను గందర గోళంలో పడేయాడానికే కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నప్రభుత్వం, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, కమీషన్ లు తీసుకోవడం తప్ప..నీళ్లు ఇచ్చే ధ్యాస టీఆర్ఎస్కు, కేసీఆర్కు ఎక్కడ ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల డీపిఆర్ లు వచ్చాక ..టిఆర్ఎస్ అవినీతి పై విచారణ జరుగుతుందని, ఏపీ చేపడుతున్నసంగమేశ్వర ప్రాజెక్టు విషయం లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని కేంద్రం ఆదేశించిందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల మహాబూబ్ నరగ్ నష్ట పోతుంది… కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని డికే అరుణ స్పష్టం చేశారు.