నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి పార్టీ మారుతున్నట్లు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నేతలు ఖండించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ ఉత్తంకుమార్ రెడ్డి,పద్మావతి ల జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, పార్టీ మారే అవసరం వారికి లేదని అన్నారు.
కొందరు వ్యక్తులు వారి పబ్బం గడుపుకోవటం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని,అటువంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలం కొంతమంది వారు సొంతంగా సృష్టించుకున్న యూట్యూబ్ ఛానెళ్లు, మీడియాను అడ్డుపెట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలలో కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,పద్మావతి రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవటం తధ్యమని ఆయన అన్నారు.
ఈ గెలుపును ఎవరూ ఆపలేరని,ఇది జీర్ణించుకోలేక కొంతమంది ఉత్తమ్ పార్టీ మారుతారని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసత్య వదంతులు నమ్మొద్దని తన్నీరు మల్లికార్జున్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,అల్లం ప్రభాకర్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్,మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, ముక్కంటి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్