డ్రగ్స్ వాడకానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ దుర్గా ప్రసాద్ సూచించారు. మారక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై మంగళవారం విటీజేఎం&ఐ విటీఆర్ డిగ్రీ కళాశాల లోని మురుగుడు హనుమంతరావు కళా ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహనా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రిన్సిపల్ వెంకటేశ్వరయోగి అధ్యక్షత న జరిగిన ఈ సమావేశంలో డిఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నిబద్ధత,క్రమశిక్షణ కలిగి విద్యను అభ్యసిస్తే భవిష్యత్ కు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడితే ఆరోగ్యం క్షీణించటమే కాకుండా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని రౌడీ షీటు తెరవటం జరుగుతుందని హెచ్చరించారు.
ఎంతో ప్రతిభ వుండి ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే యువకులు సైతం మత్తు పదార్ధాలు సేవిస్తూ ఉండటం వల్ల రూపం కోల్పోయి ఉన్న దృశ్యాలను సీతానగరం కాల్వ గట్ల వెంబడి చూడవచ్చని చెప్పారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు.
మంగళగిరి పట్టణ సి ఐ శీలం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయసులో మూడు సందర్భాల్లో డ్రగ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతుంటారని అన్నారు. సరదాగా అలవాటు చేసుకోవటం,ఒత్తిడి లో ఉన్న వారు,ఒంటరి తనం డ్రగ్స్ వాడకానికి ఎక్కువగా కారణాలవుతున్నట్లు చెప్పారు. సరదాగా డ్రగ్స్ వాడకానికి అలవాటు పడి అమ్మకం దారులుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ కు అలవాటు పడితే పరువు మంట కలిసి పోతుందని రోగ నిరోధక శక్తి తగ్గి హెచ్ ఐ వి వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు.ఇవన్నీ గ్రహించి డ్రగ్స్ జోలికి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ గోలి రామ్మోహనరావు,డాక్టర్ మాజేటి వంశీ కృష్ణ,ఎక్సైజ్ ఎస్సై మారుతి,పట్టణ ఎస్సై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.