కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు మాసబ్ ట్యాంక్ లో గల సమాచార పౌర సంబంధాల శాఖ బోర్డు రూంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీధర్ సంయుక్తంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ వైరస్ ను శ్వాసలోకి పీల్చినప్పుడు లేదా ఈ వైరస్ తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొని అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నదని తెలిపారు. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్లు గుర్తించవచ్చని తెలిపారు.
కొంత మంది చిన్నపాటి జ్వరం వస్తేనే భయపడి పోతున్నారని , అటువంటి వ్యక్తులు భయపడాల్సిన పని లేదని అన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టరును కచ్చితంగా కలవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, కంటైన్ మెంట్ జోన్ లలో ఉండే వారు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఆసుపత్రులలో డాక్టర్లకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. లాక్ డౌన్ అనంతరం కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ జగన్, తదితరులు పాల్గొన్నారు.