గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాలను విచారణ పేరుతో అనునిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. కరోనా క్లిష్ట సమయంలో హాస్పటల్స్ యాజమాన్యాలను అధికారులు వేధింపులకు గురిచేయడం సబబు కాదని ఆయన అన్నారు.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారికి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ఎప్పుడూ కరోనా రోగుల ప్రాణరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వైద్యులను అధికారులు తనిఖీల పేరుతో వేధించడం వలన కరోనా రోగుల వైద్యంపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశముందని ఆయన అన్నారు.
కరోనా హాస్పటల్స్ కు సమయానికి ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు తగిన మందులు అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆక్సిజన్ ఏ హాస్పటల్ కు ఎంత అవసరమో సరిపడా అందే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణాలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ మరణరేటు కూడా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అధికారులు వేధింపుల ధోరణిని విరమించుకోవాలని అధికారులను అరవింద బాబు డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పటల్స్ లో వైద్యులు నిరుపేదలైనా కరోనా రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేయకుండా మానవతా ధృక్పదంతో వైద్య సేవ చేయాలని సూచించారు.