నిరర్ధక ఆస్తుల పేరుతో ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం మంచిదని విశాఖ శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ పాలక మండలి కి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని, టీటీడీ భూముల విక్రయం విషయంలో వివాదాలకు తెరదించే విధంగా నిర్ణయం తీసుకోవడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి కారణంగా మూడు నెలల తర్వాత మళ్లీ శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని శ్రీ స్వరూపానంద స్వామి సూచించారు. టీటీడీ భూముల విక్రయం పై ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవోలతో శ్రీ స్వరూపానందేంద్ర స్వామి నేడు కీలక మంతనాలు జరిపారు.