కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ఎవరి మత ఆచారాల ప్రకారం వారిని ఖననం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా గుంటూరు జిల్లాలో అందుకు విరుద్ధంగా చేస్తున్నారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఒక హోటల్ యజమాని కరోనా పాజిటివ్ తో చనిపోగా అతనిని ఇస్లాం పద్ధతుల ప్రకారం ఖననం చేయాల్సింది పోయి మారుతి నగర్ లోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ యంత్రం పై దహనం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మత విశ్వాసాలను అవమాన పరచడమే
ఇది మత ఆచారాలను అవమాన పరచడమేనని, ఎవరి ఆచారాల ప్రకారం వారిని ఖననం చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇష్టానుసారం చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వలన 31 మరణాలు సంభవించినప్పటికీ ఎవరికి ఇలా జరగలేదని కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే జరిగిందని ఆయన అన్నారు.