రిషి సునాక్ బ్రిటన్ లో ఉండబట్టే ప్రధాని అయ్యారు..అదే భారత్ లో ఉంటే ఎమ్మెల్యే కూడా అయ్యే వారు కాదు.. అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం ఆవేదనతో వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకుని అవినీతిపరులను అందలం ఎక్కించే ఓటర్లు ఉన్న భారత దేశంలో రిషి సునాక్ లాంటి ఒక యువకుడు అత్యున్నత పదవికి ఎన్నిక కావడం అసాధ్యమని ఆయన అన్నారు.
మనదేశంలో డబ్బులు ఇవ్వందే ఓట్లు వెయ్యరు.. డబ్బులు లేని అభ్యర్థిని రాజకీయ పార్టీలు, ఓటర్లు పెద్దగా పట్టించుకోవు. నోటాకీ వేసినన్ని ఓట్లు కూడా మంచి అభ్యర్థికి వేయరు.. అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులు, లంచగొండులు, ఇసుక, మద్యం అమ్ముకునేవారు మన దేశంలో రాజకీయ నాయకులుగా మారారని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మన దేశంలోని మీడియా కూడా డబ్బులున్నవాడు ఎంత అవినీతిపరుడైనా వాడినే నాయకుడిగా చూపిస్తుందని ఆయన అన్నారు.
పెద్ద పత్రికలు, పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా వారు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరిద్దరిని తప్ప మిగతా వారిని చూపించరు… ఇక మంచి అభ్యర్ధి గురించి ప్రజలకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అక్కడెక్కడో బ్రిటన్ లో రుషి సునాక్ ప్రధాని అయితే జబ్బలు చరుచుకుంటున్న భారతీయులు మనదేశంలో ఇలాంటి ఎన్నిక ఒక్కటైనా జరిపించగలరా? డబ్బుకోసం మనదేశాన్ని దోచుకున్న తెల్లోళ్లే నయమనిపించారు నేడు..నల్లోడైనా పర్లేదు అవినీతి పరుడు కాకుండా ఉంటే చాలు అని రుషి సునాక్ ని ప్రధాని ని చేశారు.
మహాత్మా గాంధీ,పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణ ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు లేకుండా పోటీ చేస్తే గెలుస్తారా అని సందేహం కలుగుతోంది..అని ఆయన అన్నారు. రిషి సునాక్ లాంటి యువ నేత మనదేశంలో ప్రధాని కాగలడా? అని సూటిగా ప్రశ్నించారు. దేశ ప్రజలు ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. మార్పు కోసం యువత నడుం కట్టాలి, ప్రజలలో నాయకులు రావాలి. ఓట్ల పేరుతో జరుగుతున్న అవినీతి పోవాలి. కార్పొరేట్ల కాళ్ళ దగ్గర దేశాన్ని పెట్టె నేతలు కార్పొరేట్లతో దేశానికి సేవ చేయించాలి అని ఆయన అన్నారు.
కేంద్రంలో రాష్ట్రంలో అవినీతి పరులు అందలమెక్కి పాలిస్తుంటే సిగ్గుతో తలవంచుకుని జీవిస్తున్నామని ఆయన అన్నారు. బ్రిటీషోళ్ళు కట్టిన స్కూళ్ళు, భవంతులు, బ్రిడ్జిలు, రోడ్లు ఇంకా తలెత్తుకుని నిలబడి ఉంటే మనోళ్లు అవినీతికి పాల్పడి వేసిన బ్రిడ్జిలు, రోడ్లు,కట్టిన భవంతులు త్వరగా కూలిపోతున్నాయి…. అని ఆయన అన్నారు.