హోమియో వైద్య పితామహుడు డా. శామ్యూల్ హానిమన్ పాలరాతి విగ్రహం ( బస్ట్ ) , హిమాయత్ నగర్ , హెచ్ .ఎం. ఎ. టి భవనం, జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆయుష్ ( హోమియో ) పూర్వ అదనపు సంచాలకులు, హెచ్.ఎం.ఎ.టి గౌరవ సలహాదారు డా.శివశంకర్ కూనపరెడ్డి హానిమన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూర్వ అదనపు సంచాలకులు ( హోమియో ) , డా. జి. జనార్ధన్ రెడ్డి డా. హానిమన్ ప్రతిమకు పూలమాలను సమర్పించారు. ఈ సందర్భంగా డా.హానిమన్ జీవిత విశేషాల గురించి హెచ్.ఎం.ఎ.టి వారు ప్రశంశ లేఖనం విడుదల చేశారు.
డా. హానిమన్ ఒక కారణ జన్ముడు. గొప్ప శాస్త్రజ్ఞుడు అతని విజ్ఞత అచంచలమైన ఆత్మ విశ్వాసం , అకుంఠిత దీక్ష మొక్కవోని పట్టుదలల ప్రతిఫలమే ఆనాటి వైరుధ్య విధాన వైద్యపద్ధతులకు సవాలుగా సహజ సరళ హోమియోపతి వైద్యాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందుకే ఆయనను ‘ వినూత్న విప్లవ వైద్య విధాత ‘ అని అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు.
హానిమన్ మహాశయుడు ఒక పరిపూర్ణ జీవి. ” విజ్ఞతతో జీవించడానికి వెనుకాడ వద్దు ” అని ప్రబోధించిన ధైర్యశాలి. ఆయన సమాధి మీది స్మారక ఫలకం పై ‘ నా జీవితం వ్యర్థం కాలేదు ‘ అని చెక్కిన మాటలు పూర్తిగా సార్ధకమైనవి! ఈనాడు హోమియో వైద్య విధానం యొక్క ఆవశ్యకత పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ హోమియో వైద్య విధాన విశిష్టతను , గమనిస్తున్నాయి . విజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం హోమియో వైద్య శాస్త్రీయతను , విశ్వనీయతను పరిశీలిస్తున్నారు. కొన్ని దేశాల్లో చట్టరీత్యా కూడా దీన్ని గుర్తించారు.
ఇంతటి మహోత్తర వైద్య సంపదను మానవాళికి అందించిన హానిమన్ , ప్రతి హోమియో వైద్యుడి మదిలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించినప్పటికీ , భౌతికంగా ఆయన రూపాన్ని మన కళ్ళెదుట నిర్మించుకోవాలన్న తపనతో ఆయన పాలరాతి ప్రతిమను ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టం. అందులో మన ‘ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ‘ ప్రాంగణంలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో నెలకొల్పుకునే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతం !
ఇది డా. హానిమన్ ఆశయాలకు ప్రతిరూపం, ఆయన సంకల్పసిద్ధికి కొనసాగింపు, భావి వైద్య తరాలకు ప్రేరణ ! ఇదే మనం ఆ మహా పురుషుడికి ఇచ్చే నిజమైన నివాళి ! డా.హానిమన్ స్ఫూర్తిని కొనసాగిద్దాం .. ఆ అవతార పురుషుడి ఆశయాలను ముందు తరం వైద్యులకు అందిద్దాం. సర్వే జనా సుఖినోభవంతు !!
డా. కె. గోపాలకృష్ణ, అధ్యక్షులు, డా. జి.దుర్గాప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి