మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడా శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండి రవీంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. సోమవారం జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్ మిథిలలో ప్లాట్ నెంబర్ 57 లో డాక్టర్ రవీంద్ర కుమార్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలంకు చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశోధిస్తున్నారు. జవహర్ నగర్ సిఐ మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథిలాలోని ప్లాట్ నెంబర్ 57 లో నివాసం వుంటున్నారని, నిన్న రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ కాగా డాక్టర్ రవీంద్ర భార్య స్మిత రాత్రి పదకొండు గంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లోని తన తల్లిగారి ఇంటికి వెళ్లిందని దీనితో మనస్తాపానికి గురై తన లైసెన్స్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.
ఉదయం డాక్టర్ రవీంద్ర కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య ఆసుపత్రిలో పనిచేసే భార్య చెల్లలు స్వప్న ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న డాక్టర్ రవీంద్ర కుమార్ ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు శవ పంచ నామా చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనుమానాస్పద కేసు గా నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.