ఓయూలో కొత్త ప్రయోగం ఉన్నత విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లైఫ్సైన్సెస్ వంటి కోర్సుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధానం ప్రవేశపెట్టి, భవిష్యత్తులో ఇతర యూనివర్సిటీలకు విస్తరించనున్నారు.
త్వరలో విడుదల చేయనున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2023 నోటిఫికేషన్ ద్వారా ఈ అవకాశం కల్పించనున్నారు. గతంలో బీటెక్ పూర్తిచేసిన వారికి ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం వంటి కోర్సుల్లో మాత్రమే ప్రవేశం లభించేది. ఇక నుంచి వీరు ఎమ్మెస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనూ చేరవచ్చు. ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటి పీజీ కోర్సుల్లో చేరవచ్చు.డిగ్రీ సబ్జెక్టులతో నిమిత్తం లేకుండా పీజీ ఆర్ట్స్ కో ర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశాన్ని ఈ విద్యా సం వత్సరం నుంచే కల్పించారు.
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో ఈ తరహా ప్రవేశాలకు అవకాశం కల్పించగా అది సత్ఫలితాలనిచ్చింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినవారికైనా ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఎంఏ ఆర్కియాలజీ, సోషియాలజీ, ఇస్లామిక్ స్టడీస్, జర్నలిజం, బీఎల్ఐసీ వంటి కోర్సులకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేది.