రక్త దానం చేయడం ద్వారా వేరొకరికి ప్రాణదాతగా నిలవాలని ఖమ్మం అడిషనల్ డీసీపీ శభరిష్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను (పోలీసు ఫ్లాగ్ డే ) పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ అవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని అడిషనల్ డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో పాలుపంచుకోవాలి అన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందుతుందని తెలిపారు. ప్రతి 2సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని అన్నారు.
అత్యవసర సమయానికి రక్తం అందక ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రక్తదానం కార్యక్రమంలో రక్తదానం చేయడానికి అధిక సంఖ్యలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రక్తదానంలో పోలీస్ సిబ్బందితో పాటు ఆటో డ్రైవర్లు, యువకులు ఉత్సాహంగా పాల్గొని యాబై మందికి పైగా రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా పది రోజుల పాటు పోలీసుల పాత్ర, విధులు, పోలీసు విధుల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
26 న సైకిల్ ర్యాలీ , 28 ఆన్లైన్ ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు పోలీస్ విధులు పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు. 28 సార్లు రక్తదానం చేసిన స్పెషల్ బ్రాంచ్ ఎఏస్సై సుధాకర్ రెడ్డి, 19సార్లు రక్తదానం చేసిన సిఐ అంజలిలను అడిషనల్ డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ AR కుమారస్వామి, టౌన్ ఏసీపీ అంజనేయులు, రామోజీ రమేష్, ప్రసన్న కుమార్, CI లు అంజలి, చిట్టిబాబు , శ్రీధర్, సర్వయ్య, శ్రీనివాసులు, RI లు రవి, శ్రీనివాస్ ,తిరుపతి, శ్రీశైలం, డాక్టర్లు జీతేందర్, పాల్గొన్నారు.