నిర్మల్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేపట్టిన రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
జిల్లా మొత్తం 6601 ఇండ్లు మంజూరు కాగా అందులో నిర్మల్ నియోజకవర్గం లో 3761, ముధోల్ నియోజకవర్గంలో 2240, ఖానాపూర్ నియోజకవర్గంలో 600 ఇండ్లు మంజురైనాయని తెలిపారు.
నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. నిర్మల్ మండలంలోని ఎల్లపల్లి, నాగనాయి పేట, లక్ష్మణచాంద మండలంలోని బోరిగాం, సోన్ మండలంలోని కూచన్ పల్లి లో పూర్తి అయినా రెండు పడకగదుల ఇండ్ల కాలనీలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో పనులను త్వరగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు.
ఈ సమావేశంలో రెండు పడకగదుల ఇండ్ల నోడల్ అధికారి మురళీధర్ రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్ చౌహన్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు,ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఆర్&బి, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.