కుల మత రహిత, ఆధునిక భారత దేశం కోసం భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేశారని యునైటెడ్ బహుజన పోరాట సమితి (యుబిపిఎస్) జాతీయ కన్వీనర్ కారణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 129 వ జయంతి పురస్కరించుకొని గుంటూరు లోని యుబిపిఎస్ కార్యాలయం లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడుగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉంటారన్నారు.
దళితుల పట్ల నాటి సమాజంలో ఉన్న సామాజిక వివక్షను అరికట్టడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ తరగతి కులాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవన్నారు. స్వాతంత్రం సిద్దించి 70 సంవత్సరాలు దాటుతున్నా అణగారిన వర్గాలు దోపిడీకి గురవుతున్నాయని తిరుపతి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కె.సరస్వతి, కృపాసత్యమ్ ,నారాయణ ,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.