ఢిల్లీ తరహా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినందున కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 215 రోజుల నుంచి అమరావతి కోసం నిర్విరామంగా రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అనే నినాదంతో రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెలించకపోవడం శోచనీయమని అన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, అది మానేసి మూడు రాజధానుల బిల్లును ఆఘమేఘాల మీద ఆమోదించి గవర్నర్ కు పంపాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును ఆమోదిస్తే చరిత్రలో లో ఘోరమైన తప్పిదంగా మిగిలిపోతుందని డాక్టర్ అరవింద బాబు అన్నారు.
అమరావతి కోసం 67 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ బిల్లులకు సంబంధించి అనేక బిల్లులు న్యాయస్థానాలలో విచారణలో ఉన్నాయి. న్యాయ స్థానాలలో కేసులు నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆయన అన్నారు.
భావితరాలను దృష్టి లో ఉంచుకుని గవర్నర్ ఈ బిల్లును ఆమోదించ వద్దని కోరుకుంటున్నామని ఆయన గవర్నర్ ను కోరారు. అధికార వికేంద్రీకరణ బిల్లు, సిఆర్ డి ఏ రద్దు బిల్లులను రాష్ట్రపతికి పంపాలని ఆయన గవర్నర్ ను కోరారు.