మహబూబాబాద్ జిల్లా, మర్రి మిట్ట వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను నేడు ఉదయం మహబూబాబాద్ జిల్లా, ఏరియా హాస్పిటల్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెళ్లి కావలసిన ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయన్నారు.
చనిపోయిన వారిలో డ్రైవర్ రమేష్ కు ఆర్. ఓ. ఎఫ్. ఆర్ పట్టా ఉంది, కానీ కార్డు లేదని, అయినప్పటికీ తమ శాఖ తరపున రాము కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
మిగిలిన మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోగలమనేది అధికారులతో చర్చించి, ఆదుకుంటామని చెప్పారు.
చనిపోయిన వారి కుటుంబంలోని పిల్లలను చదివించే విధంగా, అన్ని విధాల ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు.
అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆరుగురికి 60 వేల రూపాయలను మంత్రి సత్యవతి రాథోడ్ వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులకు అందించారు. వెంటనే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి, వారి స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, ఆర్డీఓ కొమురయ్య, హాస్పిటల్ సూపరింటెందెంట్ భీమ్ సాగర్, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, టి.ఆర్.ఎస్ నేతలు భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస రెడ్డి, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.
కె.మహేందర్ గౌడ్, సత్యంన్యూస్ ములుగు