కరోనాతో అన్ని వర్గాల ప్రజల జీవితాలూ అతలాకుతలం అయిపోతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో కడపకు చెందిన తెలుగు సాహితీ పరిశోధకుడు, ప్రైవేటు డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు తవ్వా వెంకటయ్య కుటుంబం కూడా కరోనా లాక్డౌన్ తో అష్ట కష్టాలూ పడుతోంది.
ఐదు నెలలుగా విద్యా సంస్థలన్నీ మూత పడడంతో అధ్యాపకుడు వెంకటయ్య కుటుంబ పోషణ భారంగా మారింది. ఎంతో కష్టపడి సాధించిన పీహెచ్. డీ పట్టా కడుపు నింపలేకపోయింది. దీంతో విధి లేని పరిస్థితిలో భార్య బిడ్డల ఆకలి తీర్చడానికి, ఉన్నత విద్యార్హతలను కూడా పక్కన పెట్టి బేల్దారి పనికి వెళుతున్నాడు.
వెంకటయ్య దుస్థితి గురించిన వివరాలను కొందరు ఆచార్యులు, మిత్రులు ఫోటోలతో సహా వాట్స్ అప్ సమూహాల్లోనూ, ముఖ పుస్తకంలోను పెట్టారు. ఈ వార్తను కొన్ని దిన పత్రికల్లో చదివిన ప్రొద్దుటూరు డీఎస్పీ, ప్రముఖ కవి లోసారి సుధాకర్ సంస్కృతి సంస్థ శ్రీనివాస రెడ్డి మానవీయ హృదయంతో స్పందించారు.
ఈరోజు ప్రొద్దుటూరు లోని డీఎస్పీ కార్యాలయంలో తవ్వా వెంకటయ్యకు తగిన ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా బ్యాంకు మేనేజర్ కు వెంటనే డీఎస్పీ ఫోన్ చేసి వెంకటయ్య పరిస్థితిని వివరించారు. బ్యాంకు ద్వారా వ్యక్తిగత లోను మంజూరు చేయాలని కోరారు.
అంతేకాకుండా సీపీ బ్రౌన్ గ్రంధాలయంలో ఏదైనా ఉద్యోగం కల్పించి వెంకటయ్య సాహిత్య సేవలను వినియోగించుకోవడం ద్వారా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నానని డీఎస్పీ తెలిపారు. తోటి సాహితీ మిత్రుడు కరోనాతో కష్టాల పాలు అయ్యాడని, అందుకే ఆయన కుటుంబానికి తాను సంస్కృతి సంస్థతో కలిసి చేయూత అందించినట్లు లోసారి సుధాకర్ తెలిపారు.
మానవత్వంతో స్పందించి.. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సాహితీ పరిశోధకుడు వెంకటయ్యకు సాయం అందించి తన సాహితి బాధ్యతను నిర్వర్తించిన డీఎస్పీ, కవి సుధాకర్ ని ప్రొద్దుటూరు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల సాహితీవేత్తలు, జర్నలిస్టులు అభినందించారు.