ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద అభియోగాలు మోపి…తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు.
వైసీపీ ప్రభుత్వ పెద్దల తరఫున మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు APSBCL మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, APSBCL ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్కుమార్రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను నిందితులుగా ఈడీ చేర్చింది.
వీరందరికీ నోటీసులిచ్చి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావటంతో పాటు సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించింది ఈడీ. లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర వివరాలివ్వాలని కోరుతూ రెండు రోజుల కిందట సిట్ అధిపతి ఎస్వీ రాజశేఖర్బాబుకు లేఖ రాశారు.
సీఐడీ తొలుత నమోదు చేసిన FIR సర్టిఫైడ్ ప్రతులు, ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధమున్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారం అందివ్వాలని లేఖలో కోరారు. ఇప్పటివరకూ అరెస్టైన నిందితులు, వారి రిమాండు రిపోర్టులు, అభియోగపత్రం దాఖలు చేసుంటే దాని ప్రతి సమర్పించాలని అడిగారు. వాటితో పాటు ఈ కేసు దర్యాప్తులో ఉపయోగపడే, అవసరమైన ఇతర పత్రాలు, సమాచారం ఉంటే అందివ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈడీ కోరిన వివరాల్ని సిట్ అధికారులు అందించినట్లు తెలిసింది. వాటి ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్కు సంబంధించి లోతుగా వివరాలు ఆరా తీస్తోంది. బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది.
భారీగా మనీ లాండరింగ్
అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవటమే కాకుండా..కొన్ని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటికి రూ.వేల కోట్లను APSBCL ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆయా డిస్టిలరీల నుంచి కల్పిత కంపెనీలు, అసలు ఉనికిలోనే లేని సంస్థల ఖాతాల్లోకి భారీగా డబ్బు జమచేసింది. దీని వెనక భారీగా మనీ లాండరింగ్ జరిగింది. ఈ నిధుల రూటింగ్ను ఎలా చేశారు? కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని అంచెల్లో చివరికి ఎక్కడికి చేరింది? ఎవరికి చేరిందనే దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అంతిమ లబ్ధిదారును తేల్చనుంది. ప్రధానంగా ముడుపుల సొమ్మును హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు భారీగా బంగారం రూపంలోకి మార్చినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఏ స్థాయిలో ముడుపులు వచ్చాయి, వాటిని ఏయే మార్గాల ద్వారా రూటింగ్ చేసి, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించారు? అనే దానిపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. దోచుకున్న సొమ్మును నేరుగా కాకుండా వివిధ దశల్లో, అనేక దశల్లో అంతిమ లబ్ధిదారుకు చేరవేసేందుకు ఈ ముఠా డొల్ల కంపెనీలు, అస్మదీయ సంస్థలను ముందుపెట్టి కథ నడిపించింది.
ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్న మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిఫెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, డీకార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ ట్రేడింగ్స్, రుచిత జ్యుయెలర్స్, మలీష్కా గోల్డ్ అండ్ జ్యుయెలరీ, సన్ హోక్ ల్యాబ్స్, ఈషాన్వీ ఇన్ఫ్రా తదితర అనేక సంస్థలను అడ్డం పెట్టుకున్నట్లు సిట్ ఇప్పటికే తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాలన్నింటిపైనా ఈడీ దృష్టి సారించనుంది.
షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి..
లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కిక్బ్యాక్స్ కోసం ఈ ముఠా అనేక మార్గాలను అనుసరించింది. APSBCL నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానులు..అందులో 12 శాతాన్ని నగదు రూపంలోకి మార్చి ఈ ముఠాకు పంపించేవారు. దర్యాప్తు సంస్థల దృష్టిలోకి రాకుండా ఉండేందుకు అనేక అక్రమ మార్గాలు పాటించేవారు. ప్రధానంగా 5 పద్ధతులు అవలంబించేవారు అని సిట్ ఇప్పటికే దర్యాప్తులో తేల్చింది.
1. ముడుపులుగా చెల్లించాల్సిన డబ్బును డిస్టిలరీలు తొలుత బంగారం లేదా బులియన్ ఖాతాల్లోకి బదలాయించేవి. రూ.వందల కోట్ల బంగారం, నగదు ముడుపులుగా చెల్లించేవి.
2. మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు, మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించేవి.
3. ముంబయి, దిల్లీల్లోని వ్యవస్థీకృత హవాలా నెట్వర్క్ల ద్వారా ఈ ముఠాకు చెందిన షెల్ కంపెనీల్లోకి డబ్బు పంపేవి. భారత్, విదేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లేది.
4. ఈఎన్ఏ, ఖాళీ సీసాలు, మూతలు, అట్ట పెట్టెల వంటి సరఫరాదారులకు వాస్తవ ధర కంటే 3-5 రెట్లు అధికంగా చెల్లించేవారు. అదనపు మొత్తాన్ని సరఫరాదారులు నగదు రూపంలో వెనక్కి ఇచ్చేవారు. దాన్ని చట్టబద్ధమైన లావాదేవీగా చూపిస్తూ ముడుపులు పొందేందుకు మద్యం సిండికేట్ వేసిన ఎత్తుగడ ఇది.
5. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో కొంత డబ్బును నకిలీ ఖాతాలు, షెల్ కంపెనీల్లోకి పంపించేవారు. దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్లు కొన్నట్లు చూపించేవారు. నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసేవారు. ఆ సంస్థలు.. డిస్టిలరీలు, సప్లయర్లు బదిలీ చేసిన డబ్బులో కమీషన్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని నగదుగా వెనక్కు ఇచ్చేవి.
ఈ దందా నిర్వహణకు కుంభకోణం సూత్రధారులు, కుట్రదారులు, పాత్రధారులందరూ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు సృష్టించారు. వీటిపైనా ఈడీ దృష్టిసారించి.. వివరాలు రాబడుతోంది.