విద్యార్థులు చదువుల్లో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రేరణ ముఖ్యమని గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ అడిషనల్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం రోజున తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి నిర్వహించిన యురేకా 20 20 మన ఊరికె మన గురుకులం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పిల్లలతో జ్ఞాన యుద్ధం చేసి జ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులదని అన్నారు .గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పేద విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి వున్న నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో యురేకా 20 20 పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆకలైతే అన్నం కాకుండా అక్షరాన్ని విద్యార్థులు తినేలా చేస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని అన్నారు.
కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 కోట్ల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, వారు చదువుకు దూరం కాకుండా ఉండటం కోసం జ్ఞాన దీక్ష 1 ,2, 3 పేరుతో టెలివిజన్ ద్వారా తరగతులను నిర్వహించామని, గ్రామాలలో విలేజ్ లెర్నింగ్ సర్కిల్ ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నామని ఆయన తెలిపారు.
రెండవ విడతలో ఏర్పాటయ్యే గురుకులాల ఏర్పాటులో చిట్యాలకు స్థానం కల్పించేలా కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ లక్షల పెట్టుబడి పెట్టి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించే బదులు అనుభవజ్ఞులతో కూడిన ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదివించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నార్కట్ పల్లి తహసిల్దార్ రాధ, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోకల దేవదాసు కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ ,విద్యా కమిటీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ నాయకులు సిరి వేరు శేఖర్, రుద్రవరం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.