శ్రీకాకుళం మండలం పెదపాడు ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం.
ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్.
రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ ఈ రెండురకాల కరోనా వైరస్ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనా వైరస్లు జంతువుల నుండి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు వస్తుంది.
చాలా ముఖ్యమైన కరోనా వైరస్ లలో సార్స్, మెర్స్ ఉన్నాయి పరిశోధనల్లో తేలిందేమిటంటే ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది. ఇవి కాకుండా అనేక రకాలైన కరోనా వైరస్లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది.
ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎంత తేలికగా వ్యాపిస్తుందో అనే విషయం మీద స్పష్టత లేదు. నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు.
ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు. లిఫ్ట్లలో, టేబుళ్లు, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది.
ఈ 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు పెట్టినా వారికి సోకవచ్చు. అందుకే కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.
చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి. ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం 1 మీటరు (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలని ఆయన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యవతి, శాంతారావు, భూషణ రావు, కృష్ణారావు, మల్లేశ్వరి, ఆశాలత, వ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్, ఆర్ట్ రవికుమార్, క్రాఫ్ట్ త్రివేణి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.