ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కారణంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోవడం పోలింగ్ శాతంపై పెను ప్రభావం చూపిస్తుందని వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గతం కన్నా మెరుగైన మెజారిటీ రావాలని చెబుతూనే కరోనా కారణంగా తాను ప్రచారానికి దూరంగా ఉంటానని జగన్ చెప్పడం వారిని తీవ్రమైన వత్తిడికి కూడా గురిచేస్తున్నది.
కరోనాకు భయపడి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్ లో దాక్కున్నారని ఇంతకాలం చెప్పిన తాము ఇప్పుడు కరోనాకు భయపడి ఉప ఎన్నికల ప్రచారానికి రానని చెప్పిన ముఖ్యమంత్రి గురించి ఎలా వివరణ ఇవ్వాలా అని వారు ఆలోచిస్తున్నారు.
ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడతారని అలా చేయడం వల్ల కరోనా ప్రమాదం ఉంటుందని స్పష్టంగా చెప్పిన వై ఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం కోసం రాలేదా? తన ఆరోగ్యంపై భయంతో రాలేదా అని ఇప్పటికే జనం ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంపై దృష్టి ఉంటే తిరుపతి ఉప ఎన్నిక జరిగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ అందరికి ఇచ్చే విధంగా ప్రధానిని కోరి ఉండేవారని కూడా అంటున్నారు.
వ్యాక్సిన్ అందరికి ఇవ్వకుండా కరోనా భయం ఉందని చెప్పడం గతంలో తాము చెప్పిన దానికి విరుద్ధంగా ఉందని, దీన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. పారాసిటమాల్ తో తగ్గిపోతుందని, కరోనాతో కారణంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన తమ ప్రభుత్వాధినేత కరోనా కారణంగా ప్రచారానికి రాలేకోవడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
చంద్రబాబునాయుడు, లోకేష్ లు తిరుపతి లోక్ సభ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ప్రచారానికి రాని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చుట్టూ ఉండేవారికి కరోనా వచ్చిందని ప్రచారం చేయడం పై కూడా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
వై ఎస్ జగన్ ప్రచారానికి రాకపోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంటుందని వారు భావిస్తున్నారు.