త్రిబుల్ ఎక్స్ పేరుతో సీరియల్ తీస్తున్న ప్రముఖ టీవీ సీరియల్స్ సంస్థ ఎఎల్ టి బాలాజీ అధినేత్రి ఏక్తా కపూర్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
శారీర భాగాల ప్రదర్శన, అశ్లీలం తదితర అంశాలు సున్నితమైనవని వాటిని తెరపై చూపించేందుకు సన్నని గీత ఉంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు (ఇండోర్ బెంచ్) వ్యాఖ్యానించింది.
ఈ సీరియల్ కు సంబంధించి తనపై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చేయాలని ఏక్తా కపూర్ మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు తిరస్కరించింది.
ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంలో ఎలాంటి పొరబాటు లేదని పేర్కొన్నది. సంబంధిత సీరియల్ అశ్లీలమైనదా కాదా అనే విషయాన్ని విచారించడంలో తప్పులేదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొన్నది.
ఏక్తా కపూర్ తన సీరియల్ ద్వారా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నదని, మత సంబంధిత విషయాలను రెచ్చగొడుతున్నదని ఫిర్యాదు రావడంతో త్రిబుల్ ఎక్స్ రెండో సీరియల్ పై ఫిర్యాదులు రావడంతో వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందేనని జస్టిస్ శైలేంద్ర శుక్లా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెరపై తన పేరు కనిపించదని, తనకు కంటెంటుతో సంబంధం లేదని ఏక్తా కపూర్ కోర్టుకు తెలిపింది.
అయితే ఆ సీరియల్ నిర్మిస్తున్న సంస్థకు యజమాని కాబట్టి ఏక్తా కపూర్ బాధ్యత వహించాల్సిందేనని జస్టిస్ శుక్లా అభిప్రాయపడ్డారు.