వృద్ధులు మనకు భారం కాదని.. నేటి తరానికి మార్గదర్శకులని విజయనగరం జిల్లా విభిన్న ప్రతిభావంతులు – వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జగదీష్ పేర్కొన్నారు. వారిని ప్రేమగా చూసుకోవాటం.. గౌరవించటం మన ప్రాథమిక కర్తవ్యం అని అన్నారు. సమజానికి, కుటుంబ వ్యవస్థ కోసం వారి జీవితాలను త్యాగం చేసిన మహనీయులని ప్రశంసించారు. భావితరాలకు వారు అనుసరించిన విధానాలు, పద్దతులు తప్పకుండా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న ప్రతిభావంతులు – వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కె.ఎల్.పురంలోని యూత్ హాస్టల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 80 సంవత్సరాల వయసు పైబడిన 12 మంది వయోవృద్ధులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. జిల్లా అధికారులు, వివిధ సంస్థల ప్రతనిధులు పాల్గొని వృద్ధులను దుశ్శాలువాలతో సత్కరించారు. గౌరవప్రదంగా వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకొని వారికి విలువైన జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా వృద్ధులు మనకు భారం కాదనే పేరుతో ఉన్న బ్యాగులను ఆవిష్కరించి వృద్ధులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు – వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జగదీష్, చదలవాడ ప్రసాదు, వయో వృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, వృద్ధ మిత్ర జిల్లా కో-ఆర్డినేటర్ డా. బి. కామేశ్వరరావు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.