ఎన్నికల విధులు నిర్వహించిన రెవిన్యూ సిబ్బందికి రెన్యూమరేషన్ ఇవ్వకుండా చేతులెత్తేయడం పై వి ఆర్ ఓ లు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారంనాడు జరిగింది.
వివరాల్లోకి వెళితే పెదవేగి మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు నిర్వర్తించినందుకు రావాల్సిన పారితోషికం ఇప్పటి వరకూ చెల్లించలేదు.
రెన్యూమరేషన్ ఇస్తారా లేదా అనేదానిపై అధికారులతో తాడో పేడో తేల్చుకుందామని వారు నిర్ణయించుకున్నారు.
అందుకు మండలం లో పనిచేసే వి ఆర్ ఓ లంతా పెద్ద ఎత్తున ధర్నా చేయాలనుకున్నారు.
ఈ ధర్నా సమాచారం తెలుకున్న మండల పరిషత్ కార్యాలయ అధికారులు మంగళవారం విధులకు రాకుండా గైర్హాజరయ్యారని పెదవేగి మండల వి ఆర్ ఓ ల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి వాసు, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మాణిక్యాలరావు తెలిపారు.
మండలం మొత్తం మీద 22 మంది వి ఆర్ ఓ లకు, 9 మంది ఆఫీస్ స్టాఫ్ కి 40 మంది పైగా వి ఆర్ ఏ లకు ఎన్నికల విధులకు సంబంధించిన రెన్యూమరేషన్ సొమ్ములు నాలుగు నెలలుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాసు ఆరోపించారు.
ఉదయం నుండి మండల పరిషత్ కార్యాలయానికి రాని అధికారులు సాయంత్రం రెన్యూమరేషన్ సొమ్ములు విషయం పై స్థానిక తహశీల్దార్ సింగ్ తో మంతనాలు జరిపారని వాసు, మాణిక్యాల రావు తెలిపారు.
రెమ్యునరేషన్ సొమ్ములు ఇచ్చేంత వరకు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తామని వాసు హెచ్చరించారు. వి ఆర్ ఓ ల సమస్య పై ఇంచార్జి ఎం పి డి ఓ ని వివరణ కోరేందుకు మంగళ వారం సాయంత్రం ఫోన్ చేసినా స్పందించ లేదు.