ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజుపై ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది. సగంలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆయన తక్షణమే ప్రారంభించాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనర్ ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయలేదు.
అందువల్ల మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించడం ఇప్పుడు తక్షణం రిటైర్డ్ జస్టిస్ కనగరాజు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీలకు కూడా రెండు దశల్లో గత నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని కూడా పూర్తి చేయడం ద్వారా 14వ ఆర్థిక సంఘం నిధులను సత్వరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చుకునే విధంగా జస్టిస్ కనగరాజు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల కోడ్ ను ఎత్తి వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇబ్బంది లేకుండా తక్షణమే ఎన్నికల కోడ్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయాలన్నీ వేరే కారణాలు చెప్పకుండా ఎన్నికల కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేసినందున రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎలాంటి అనుమానం అవసరం లేదని కూడా నూతన ఎన్నికల కమిషనర్ అవసరం అయితే కేంద్రానికి చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పటికే పెండింగులో ఉన్న ప్రతిపక్షాల ఫిర్యాదులను కూడా నూతన ఎన్నికల కమిషనర్ సత్వరమే పరిష్కరించాల్సి ఉంటుంది. లేదా అవన్నీ గత ఎన్నికల కమిషనర్ కు ఇచ్చినవి అయినందున మళ్లీ ఫిర్యాదులు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇలాంటి క్లిష్టమైన అంశాలను తక్షణమే పరిష్కరించి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత నూతన ఎన్నికల కమిషనర్ పై ఉంటుందనడంలో సందేహం లేదు.