కేరళలోని ఇడుక్కి జిల్లా వెల్లరామ్చిట్టాలో ఏనుగు దాడిలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బడరిప్పన్ అనే అయ్యప్ప భక్తుడు శబరిమలలో దేవున్ని దర్శించుకోవడానికి వెల్లరామ్చిట్టా అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు.
అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అలసిపోవడంతో తనతో వచ్చిన అయ్యప్ప భక్తులతో కలిసి నిద్రపోయాడు. నిద్రలోకి జారుకోగానే అటుగా వెళ్తున్న ఏనుగు బడరిప్పన్పై దాడి చేయడంతో కేకలు వేశాడు. దీంతో మిగతా అయ్యప్ప భక్తులు ఏనుగు బారి నుంచి తప్పించుకొని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొనిసరికి బడరిప్పన్ చనిపోయి ఉన్నాడు.
పెరువంథానామ్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 2019 జనవరిలో శబరిమాలలోని సాలెమ్ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన అయ్యప్ప భక్తుడిపై ఏనుగు దాడి చేయడంతో అతడు చనిపోయాడు. 2018 జనవరిలో కేరళలోని కరిమాళా ప్రాంతంలో చెన్నైకు చెందిన అయ్యప్ప భక్తునిపై ఏనుగు దాడి చేయడంతో అతడు మరణించాడు.