తమిళనాడు లోని హోసూరు, సూల్ గిరి లోతట్టు అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల మంద రావడంతో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్ర , తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఏనుగులు కనిపిస్తున్నాయి.
అటవీ సరిహద్దు ప్రాంతం అయిన మోట్ల చేను, గుడ్ల నాయన పల్లి, సోడి గాని పల్లి , గంగాపురం , యమసనపల్లి ప్రాంతంలో ఏనుగులు పొలాలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ ప్రాంతాలే కాకుండా మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాలైన చిన్న పర్తి కుంట, పెద్ద పర్తి కుంట, సంగనపల్లి, బోయనపల్లి, కుసురులలో కూడా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి.
ఈ అటవీ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ఉన్న టమోట, క్యాబేజ్, మొక్కజొన్న వరి, బొప్పాయి, బీన్స్, అరటి పంట పొలాలపై అర్ధరాత్రి వేళలో ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఈ ఏనుగులను చెదరగొట్టేందుకు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎలిఫెంట్ ట్రాకర్స్ రంగంలోకి దిగారు.
ఏనుగులు మంద పంట పొలాల పై కి రాకుండా ఉండేందుకు గతంలోనే అక్కడక్కడ విద్యుత్ కంచె, కంద కాల్వలు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.