దీర్ఘకాలికంగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న చేజర్ల గ్రామానికి రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో, రూ 3.47 కోట్ల నిధులతో సాగర్ నీటితో బేతంరాజు చెరువును నింపేందుకు ఎత్తిపోతల పథకం దోహదపడనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
గురువారం ఆయన ఈ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ బి. సాంబశివారెడ్డి పల్నాడు జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి ల తో కలిసి ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడి (జవహార్) ప్రధాన కాలువ పై 92.20 కె.యం పాయింట్ వద్ద చేజర్ల ఎత్తిపోతల పథకము నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదించామన్నారు.
దీని ద్వారా రోజుకి 16 గంటలు చొప్పున 100 రోజులపాటు మంచినీటిని సాగర్ కాలువ నుండి 4.92 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా బేతం రాజు చెరువుకి పంపింగ్ చేసి అక్కడ నుండి గ్రామానికి మంచినీటిని అందించడం జరుగుతుందని వివరించారు. ఏడాది కాలంలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.47 కోట్ల నిధులను కేటాయించనుంది.
చెరువు నిండితే ఏడాది పొడవునా తాగునీటి లభ్యత,197 ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందనుందని తెలిపారు. ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చినందుకు రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేసి సహకారం అందించడం తో పాటు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ బి.
సాంబశివారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. సమిష్టి కృషితోనే సాకారంమైనదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక సంస్కరణలతో, పారిదర్శకంగా పనిచేస్తుందని వివరించారు.
మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జె సి ఎస్ మండల ఇన్చార్జి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, భాస్కరరెడ్డి,ఎంపిటిసి వెంకటరెడ్డి, మండల పరిషత్,ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.