రోడ్డు ప్రమాదంలో మరణించిన తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డు ఎం. కుశలవ కుటుంబాన్ని ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. 2012లో సెక్యూరిటీ గార్డ్ గా(సొసైటీ) చేరిన కుశలవ 2017లో తిరుమల నుంచి విధులు ముగించుకుని స్వగ్రామం చంద్రగిరి వద్ద గల చానంబట్ల కు వెళ్తూ తొండవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరి మూడు సంవత్సరాల పాటు కోమాలో ఉండి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆయన భార్య ప్రవల్లిక ను నాలుగు సంవత్సరాల బిడ్డను ఆదుకోవాలని, ప్రవల్లికకు టీటీడీలో ఉపాధి కల్పించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మయ్య కు మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి టిటిడి పరిపాలన భవనంలో నవీన్ కుమార్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 12 సంవత్సరాలుగా ఈఎస్ఐ,పిఫ్ పోను కేవలం 10,630 రూపాయల చాలీచాలని జీతంతో పనిచేస్తున్న సుమారు 450 మెన్(MEN) సెక్యూరిటీ గార్డ్స్ అలాగే 120 ఉమెన్(WOMEN) సెక్యూరిటీ గార్డ్స్ సొసైటీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత(JOB & HEALTH SECURITY) కల్పించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పై ఉందని ఆయన అన్నారు.
టిటిడి సొసైటీలలో,ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులతో పాటు ఇతర విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు,పోటు కార్మికులకు దురదృష్టవశాత్తు అనుకోకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు టీటీడీ లో ఉపాధి కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.