వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం వేచి చూసిన ఉద్యోగులు ఇక ఉపేక్షించదలచుకోలేదు. ఇంత కాలం ఎన్ జీవోల నాయకులను నయానో భయానో అణచి వేసిన ప్రభుత్వం ఆటలు ఇక ఇప్పుడు సాగే అవకాశం కనిపించడం లేదు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఏపి జెఏసి అమరావతి ఇప్పటి కే రెండు దశల ఉద్యమాలు చేయగా మూడో దశ ఉద్యమంలోకి అడుగుపెట్టింది. సూర్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపిజిఇఏ) నేటి నుంచి ఉద్యమబాటలోకి వచ్చింది. ఈ రెండు ప్రధాన యూనియన్లు ఉద్యమ బాట పట్టడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో
పాలుపోవడం లేదు. ఇంతకాలం ఉద్యోగ సంఘాల నాయకులను భయపెట్టి లొంగదీసుకున్న ప్రభుత్వానికి ఇక ఆ పని చేయడానికి వీలుకావడం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ తమ సభ్యులకు సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉద్యమం నడపాల్సిన పరిస్థితిలోకి వచ్చారు.
ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా జగన్ కు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడైన ఏపి సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెంకటరామిరెడ్డి పై కూడా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల అనైక్యతకు ప్రధాన కారణం వెంకటరామిరెడ్డేనని కూడా అందరూ అంటున్నారు. వెంకటరామిరెడ్డితో బాటు ముఖ్యమంత్రి జగన్ కు నమ్మిన బంటుగా మారిపోయిన బండి శ్రీ నివాసరావు పై కూడా పూర్తి స్థాయిలో వత్తడి పెరిగిపోయింది.
సీపీఎస్ రద్దు పై ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత పూర్తిగా మాట తప్పారు. అదే విధంగా 11వ పీఆర్ సీ అమలుపై ప్రభుత్వం తీవ్ర అలక్ష్యం వహించింది. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించి లొంగ తీసుకుని ఉత్తుత్తి జీవోలు విడుదల చేసి తమను మోసం చేసిందని కూడా ఉద్యోగులు భావిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కూడా నేతలను లొంగదీసుకోవడంతో ప్రభుత్వంపై టీచర్లు ఉద్యోగులు వత్తడి తీసుకురాలేకపోయారు.
త్వరలో 12వ పీఆర్ సీ పనులు కూడా ప్రారంభం అవుతాయి. అలాంటిది 11వ పీఆర్ సీ నే అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయింది. దీనంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు.