దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఉద్యోగుల హక్కులు, రాయితీలు రాను రాను పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితులు రావడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఆరు డిఏలను బకాయిపడ్డద్ది. అందులో మూడు డిఏలను అంటే జనవరి 2020, జులై 2020, జనవరి 2021 బకాయిలను ఈ ఏడాది జనవరి 19న ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ద్వారా మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.
ఇంకా రావాల్సిన మూడు డిఏలు అంటే జులై 2021, జనవరి 2022, జులై 2022 ఎప్పుడు ఇస్తారో ఏలిన వారికే ఎరుక. ఉద్యోగ ఉపాధ్యా సంఘాలు కూడా గొంతు విప్పి ప్రభుత్వాన్ని గట్టిగా అడగడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు అంటున్నారు. పైగా న్యాయంగా రావాల్సిన డిఏలను ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ఇస్తానని ప్రకటించగానే దసరా కానుక, ఉగాది కానుక అంటూ దళారులుగా మారి ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం దగ్గర పణంగా పట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారని వారు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులను కాలరాయడానికి కాకుండా కాపాడేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలని వారు కోరుకుంటున్నారు.