జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపీడీవో లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఏపీఓలు, డి ఆర్ డి ఎ అదనపు ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం 200 మంది కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పనిస్థలాల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని సూచించారు. ఉపాధిహామీ పనులకు కూలీలు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు.
గ్రామ సభలు నిర్వహించి రైతులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే చేసేవిధంగా రెజల్యూషన్ ఆమోదించుకొని పనులు చేపట్టాలన్నారు. కొత్త సాఫ్టువెర్ ప్రకారం ఉపాధి హామిలో 260 రకాల పనులు చేపట్టవచ్చని తెలిపారు. కూలీల సంఖ్య పెంచేలా నూతన పనులను కల్పించాలన్నారు.
రైతుల వరి పొలాల్లో అంచులు తీయించడం, అడవికి ట్రెంచ్ కొట్టించడం వంటి పనులను ఉపాధి హామీలో చేయించాలని ఆదేశించారు. కూలీల సంఖ్య లో తక్కువగా ఉన్న మండలాల ఎంపీడీవోల పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
కూలీల సంఖ్య ను పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా వివిధ సంక్షేమ శాఖల నుండి వచ్చిన ప్రజల రుణాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎంపీడీవో లను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తును ఎంపీడీవోల వద్ద పెండింగ్లో ఉండడానికి వీలు లేదని ఆదేశించారు.
ఈ సమావేశంలో పి డి డి ఆర్ డి ఎ నర్సింగరావు అదనపు పీడీ రాజేశ్వరి, ఏపిడిలు, చంద్రశేఖర్ శ్రీనివాసులు డి ఆర్ డి ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా