సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేసుకోవాలని, ఉపాధి హామీ ద్వారా గరిష్టంగా కూలి పొందేలా పనులు చేయాలని హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మెళ్ళచెరువు మండల కేంద్రంలో ఈరోజు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను జడ్పీ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి విజయలక్ష్మీ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అలాగే ఎవరి త్రాగు నీరు, వారే తెచ్చుకోవాలని, కొలతల ప్రకారం పనిచేయడం వలన గరిష్ట కూలి పొంద వచ్చని తెలిపారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలని లేని వారు వెంటనే ఇంకుడు గుంత తీసుకోవాలని, దానివల్ల ఇంటి ఆవరణలో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
ఇంకుడు గుంత లేకుండా ఉండటం వలన గ్రామాల్లో డ్రైనేజిలో నీరు చేరి రోగాలు వ్యాప్తి చెందుతాయని, రోగాల నివారణకు వ్యక్తి గత పరిశుభ్రత ఒక్కటే మార్గమని కూలీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి విజయలక్ష్మి ,MPDO, APO, MPO, మెళ్ళచెరువు గ్రామ సర్పంచ్ శంకర్ రెడ్డి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.