పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామంలో చారిత్రాత్మక సన్యాసుల గుట్టును కొంతమంది కబ్జాదారులు కబళించివేస్తున్నారు.
ఇప్పటికే సుమారు 10 ఎకరాల వరకు గుట్టును ఆక్రమించిన వ్యక్తులు ఆ గట్టును తవ్వి చదును చేస్తున్నారు. దాన్ని వ్యవసాయ భూమిగా మార్చి నకిలీ పట్టాలు పుట్టించి కోట్లాది రూపాయలు కు మళ్లీ అమ్మి సొమ్ముచేసుకున్నారు.
ఈ గట్టు పెద వేగి మండలం తాళ్లగోకవరం, లింగ పాలెం మండలం బాధరాల, కామవరపుకోట మండలం తడికల పూడి గ్రామాల సరిహద్దులలో ఉంది.
అందుకే ఈ గట్టు మాది కాదంటే మాది కాదని ఆయా మండలాల రెవిన్యూ అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత నెల రోజులుగా కొంత మంది మట్టి మాఫియా దారులు ఆ గట్టు మట్టిని చాటు మాటుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
ఈ గట్టు సుమారు 25 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఈ గట్టు పూర్తిగా ప్రభుత్వ రక్షణ లో ఉండే ప్రదేశం. భావితరాలకు కావలసిన చరిత్ర ఆధారం.
వేంగీ రాజుల కాలం లో అప్పటి రాజులకాలం లో క్రతువుల్లో నిర్వహించే కొంతమంది సన్యాసుల కు ప్రత్యేకంగా రాజులు బహుమానంగా ఇచ్చిన మఠం భూమి అని పూర్వీకులు అంటుండే వారని ఈ గ్రామస్తులు చెప్పారు.
అటువంటి చరిత్ర కలిగిన సన్యాసుల గట్టుకు 2016, 2017 లో తాళ్ల గోకవరం గ్రామంలో పనిచేసిన ఒక వి ఆర్ ఓ ఒకరు ఈ గుట్టులో కొంత భాగాన్ని ఆక్రమించుకున్న వ్యక్తుల నుండి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకుని ఆక్రమణ దారులకు అక్రమ పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఈ వి ఆర్ ఓ అక్రమ బాగోతం కప్పిపుచ్చుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా గ్రామ రెవిన్యూ రికార్డుల నుండి ఈ గట్టుకు సంబందించిన 1నుండి 20 వరకు సర్వే నంబర్లు, ఆడంగల్, ఆర్ ఎస్ ఆర్ వంటి ప్రధానమైన పేజీలను మాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ గట్టుకు అక్రమ పట్టాలు పట్టించుకున్న ఆక్రమణ దారులు వి ఆర్ ఓ కి మరిన్ని ముడుపులు ముట్టజెప్పి ఒక వ్యక్తి 5 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయించుకుని సుమారు కోటి రూపాయలకు అమ్ముకుని తాళ్ల గోకవరం గ్రామం నుండి వెళ్లిపోయినట్టు తెలిసింది.
ఇప్పటి కైనా జిల్లా అధికారులు పెదవేగి, లింగపాలెం, కామవరపుకోట మండలాల అధికారులు చారిత్రాత్మకమైన సన్యాసుల గట్టు పరి రక్షణకు సత్వర చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.