కడప పట్టణంలో నిర్మించిన అక్రమకట్టడాలను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా అధికారులకు సూచించారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి మరియాపురం సబ్ స్టేషన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడప పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. ఈ భారీ వర్షం వల్ల ఊటుకూరు చెరువు పూర్తిగా నిండిపోయిందన్నారు.
దీంతో 46, 47, 48, వ డివిజన్ల ప్రాంతాలగుండా నీరు వచ్చి మరియాపురం ప్రాంతంలోని సబ్ స్టేషన్, కొన్ని ఇళ్లలోకి నీరు ప్రవేశించిందన్నారు. పెద్దపెద్ద డ్రైన్ లు అన్నీ ఆక్రమణకు గురి కావడం వల్ల నీరు సరిగా బయటికి వెళ్ళలేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు.
డ్రైన్స్ పై ఆక్రమణలు తొలగించండి
వెంటనే అధికారులు స్పందించి జెసిబి ల ద్వారా డ్రైన్స్ పై ఆక్రమణలు తొలగించాలన్నారు. ప్రజలు ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వారందరూ మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలన్నారు. డ్రైన్ ల నిర్మాణాలకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ కింద కోటి రూపాయలు మంజూరయిందన్నారు.
ఆ పనులకు సంబంధించి 25 లక్షలు వచ్చిన తర్వాత పనులు అక్కడక్కడా ఆగిపోవడం జరిగిందన్నారు. అవన్నీ ప్రస్తుతం15 ఫైనాన్స్ నిధులతో డ్రైన్ లు పూర్తిగా నిర్మించి భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలు వంకలు వాగులు గా ఉండేవన్నారు. వీటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ఇల్లు నిర్మించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. నగరంలోని అక్రమకట్టడాలను వెంటనే తొలగించి లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని రెండు రోజులలో తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, 31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, తదితరులు పాల్గొన్నారు.