రాష్ట్రంలో ఆలయాలను దోచుకుంటున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు.
దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలకు చిరు ఉద్యోగులను బలిచేయడం సరికాదని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో సురేష్ బాబు ప్రమేయం లేకుండా విజయవాడ కనకదుర్గ దేవాలయంలో అవినీతి జరిగే పరిస్థితి లేదన్నారు.
వెల్లంపల్లి వచ్చిన తర్వాత దుర్గగుడిని దోచుకుంటున్నారని మొదటి నుంచి టీడీపీ చెబుతోందన్నారు. రాష్ట్రంలో దేవాలయాల ఆదాయాన్ని దోచుకుంటున్నారని కేశినేని ఆరోపించారు.
విజయవాడ నగరపాలక సంస్థపై టీడీపీ జెండా ఎగురవేస్తామని కేశినేని నాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను ఐదు రెట్లు పెంచుతామని సీఎం జగన్ చెబుతున్నారని, కరెంట్, గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రజలను హింసకు గురిచేస్తున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రజలపై ఒక్క రూపాయి పన్ను భారం కూడా వేయకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తామని కేశినేని నాని స్పష్టం చేశారు.