చరిత్రను మార్చబోయే తొలి అడుగు వేస్తున్నామని, మనబడి నాడు-నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 45 వేల స్కూళ్లలో మూడు దశలుగా నాడు-నేడు కార్యక్రమం చేపడతామన్నారు. మొదటి దశ కింద 15,715 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తరగతి గదుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని, అదనపు తరగతి గదులు, ఇంగ్లీషు ల్యాబ్లు వంటి 9 రకాల సేవలు వస్తాయన్నారు. ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి స్కూల్లో తప్పనిసరిగా తెలుగు సబ్జెక్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని జగన్ తెలిపారు.
ఒంగోలులో ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెటే కనిపిస్తోందని, మరో పదేళ్లలో పరిస్థితి ఇంకా మారిపోతుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలని అన్నారు. పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకం కానున్నాయన్నారు. ఇంగ్లీషు చదువు లేకపోతే వాళ్ల భవిష్యత్ ఏంటి? అని జగన్ ప్రశ్నించారు. 33శాతం మంది పిల్లలు చదువురాని వారు ఉన్నారని, పేదల తలరాత మార్చాల్సిన అవసరం లేదా? అని అన్నారు. కార్పొరేట్ చదువులకు కొమ్ము కాయడం సమంజసమా? అని జగన్ నిలదీశారు.