రాష్ట్రమంతా త్వరలో అంధకారంలోకి వెళ్తుందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక 29వ వార్డు నందు జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న డా౹౹చదలవాడ వైసిపి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా త్వరలో అంధకారంలోకి వెళ్లిపోతుంది విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనుభవం లేని, ఎవరు చెప్పినా ముఖ్యమంత్రికి అర్థం కాదన్నారు.
అనుభవం లేని వారిని సలహాదారులుగా పెట్టుకున్న జగన్ మనకు దొరకటం మన దౌర్భాగ్యం అని తెలిపారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం రాష్ట్ర సంపద, నిధులను దోచుకోవడం,దాచుకోవడం కమీషన్లకు కక్కుర్తి పడడం వారి నైజమని, పక్క రాష్ట్రాలకు లేని విద్యుత్ కోత మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బకాయిలు పడటం బొగ్గును నిల్వ చేయకపోవడంతో ఈ లోపం వచ్చిందన్నారు.
ఇతర ఇతర ప్రాంతాల నుండి కమీషన్లకు కక్కుర్తిపడి ఎంత విద్యుత్ కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. మా నాయకుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విద్యుత్ కోతలు అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియదని, గ్రామాల్లో ఆరు గంటలు,పట్టణాల్లో మూడు గంటలు విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీలో మా నాయకుడు దండం పెట్టి మరి ప్రాధేయపడ్డాడు త్వరలో విద్యుత్ కోతలతో అంధకారంలో మిగులుతుందని,విద్యుత్ కొనుగోలు చేయండి బొగ్గు నిల్వలు పెంచండి అని చెప్పిన పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.