ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట నిప్పు కోసం ఇంకొకడు పరుగెత్తాడట. ఇది సామెతే కావచ్చు కానీ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఇదే జరుగుతున్నది. కరోనా వైరస్ విజృభణను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
లాక్ డౌన్ సందర్భంగా అవసరమైన మేరకు మద్యం సరఫరా కావడం లేదు. అంతే కాకుండా నిర్ణీత వేళల్లో మద్యం దుకాణాలు తెరవడం వల్ల మద్యం అందరికి అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణంగా మద్య పాన ప్రియులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మద్యం దొరక్క బంజారాహిల్స్ లో ఒక వ్యక్తి మేడపై నుంచి దూకిన విషయం తెలిసిందే. అదే విధంగా మరొక వ్యక్తి మద్యం దొరక్క చెయ్యి కట్ చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఎందరో తయారువుతున్నారు. దాంతో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
మద్యం లేక పోవడంతో పిచ్చి గా వ్యవహరిస్తున్న కొందరి చేష్టలను తట్టుకోలేక బంధువులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. నేడు ఒక్క రోజే ఓపీకి 100కు పైగా బాధితులు వచ్చారు. దాంతో ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
ఇంత మంది రోగులను పరీక్షించే సిబ్బంది అక్కడ లేరు. అంతే కాకుండా అక్కడకు వచ్చిన రోగులు తమను తామే హింసించుకుంటున్నారు. కోసుకుంటున్నారు. గాయపరచుకుంటున్నారు. ఇలాంటి వారిని అదుపు చేయడం తమకు సాధ్యం కాదని సిబ్బంది అంటున్నారు.