వెంకటాపూర్ (రామప్ప) ఎరుకల నాంచారమ్మ ఆలయం( పంచ కూట ఆలయం) పునర్నిర్మించాలని, సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు కోరారు.
బుధవారం ములుగు మండలంలోని రామానుజపురం గ్రామ సమీపంలో పంట పొలాల మధ్య ఉన్న ఎరుకల నాంచారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా మూడు రోజులపాటు జాతర చేసేవారు.
కోవిడ్ నేపథ్యంలో ఈ సారి 10మంది స్థానికులు, హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా లోకిని రాజు మాట్లాడారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఆలయాలను పునరుద్ధరణ కు కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వాలు ఎరుకల నాంచారమ్మ పేరుతో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించడం లో చిన్న చూపు చూడడం తగదన్నారు.
ఐదు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా తరలివచ్చే ఎరుకల కులస్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, అమ్మ వారి ఆశీస్సులతో వచ్చే ఏడాది కరోనా అంతమవుతుందని జాతర వైభవంగా నిర్వహించేందుకు, నాంచారి విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ప్రభుత్వం, పురావస్తుశాఖ, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని దీనికోసం గిరిజన శాఖామంత్రి సత్యవతి రాథోడ్ స్పందించా లన్నారు. గిరిజనులు అంటే ఒకటి, రెండు కులాలు కాదని ప్రతి తెగ లోని సంస్కృతి, సంప్రదాయాలు దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలన్నారు.
ఎరుకల సంస్కృతి సంరక్షణకు ,నాంచారమ్మ ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్క ఎరుక ఏకలవ్యుడిలా పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి నాయకులు పల్లకొండ భాస్కర్ ,పాలకుర్తి సురేష్, దేవ రాయ సారయ్య, గణేష్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కే తిరి సుభాష్, నాయకులు కెంసారం రాజు, కేతీరి సారయ్య, జగన్నాథం సదానందం, హైదరాబాద్ యూత్ నాయకులు దేవరాయ రాధాకృష్ణ ,కూరాకుల క్రాంతి కుమార్, కేంసారం రాజ్ కుమార్ , సీహెచ్ సునిల్ కుమార్, పి. బల్వంతరావ్ తదితరులు ఉన్నారు.